Tuesday, August 4, 2026

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం .

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 
  
   కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 
           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు . అవి 
    1 . కోష్ఠశ్రీత కామల .
 
    2 . శాఖాశ్రీత కామల .
    3 . కుంభ కామల 
      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 
  వ్యాధి లక్షణాలు -
     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 
  1 . కళ్లు పసుపు రంగులో ఉంటాయి.
   2 . శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 
   3 . అన్నం తినాలనిపించదు.
   4 . వాంతులు అవుతాయి.
   5 . కొంతమందిలో దురద వస్తుంది . 
   
  పాటించవలసిన ఆహారనియమాలు -
    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.
  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం - 
 * నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.
 * నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 
 * తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 
 * ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 
 * కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 
 * త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.
 * చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.
        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 
  

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.

                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 

             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .

         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.

       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

 రవి -

   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.

 చంద్రుడు -

   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .

 కుజుడు -

    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .

 బుధుడు -

    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .

 గురుడు -

     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.

  శుక్రుడు -

     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .

  శని -

     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .

         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  

  

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం -

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 

      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 

              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 

 గమనిక - 

    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్, 
ఎండలో అతిగా తిరగడం , ఎక్కువ దూరం నడవడం , అతిగా శ్రమ చేయుట , పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం భుజించటం , నువ్వులు , వెల్లుల్లి , మినుములు , అవిసె ఆకు , కొత్త నీరు , పులిసిన గంజి , వేడి నీరు , గో మూత్రము , తాంబూలం , పెరుగు , రేగిపళ్ళు , నూనె వేపుళ్లు , చింతపండు , కోడిమాంసం , చేదు , లవణ , ఆమ్ల రసాల గల పదార్దాలు నిషిద్దం .

  పైన చెప్పిన ఔషధ యోగాన్ని పాటిస్తూ పథ్యం చేసిన త్వరగా సమస్య నుంచి బయటపడతారు . ఈ ఆహార పథ్యం మీ శరీరంలో వేడి తగ్గేవరకు పాటించి ఆ తరువాత మోతాదులు తగ్గించి తీసుకోవలెను 

  

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట .

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట . 
 
 శుక్లశోణిత సంయోగముచే జనించిన దేహము నందు చర్మము , రక్తము , మాంసం కొవ్వు , ఎముకలు , నరములు గూడుకట్టుకుని ఉన్నవి. మరియు మానవశరీరం నందు 70 వేల నరములు ఉన్నవని శరీరశాస్త్రం తెలుపుతుంది. ఈ నరములు శరీరమున గల లక్షణములను తనచలనములు వలన నిరూపించుచున్నవి ఈ నరముల చలనములే నాడీపరిజ్ఞానముకు మూలాధారములు అయి ఉన్నవి.
     
శరీరమున గల నాడులు 5 నామములతో పిలవబడుచున్నవి . అవి 
   *  భూతనాడి .
   *  వాతనాడి .
   *  పిత్తనాడి .
   *  శ్లేష్మనాడి . 
   *  గురునాడి . 
       
       ఆహారవిహారాదుల యందు మానవుడు సరైన మార్గమము అనుసరించక పోవడం వలెనే రోగములు ఉద్భవించుచున్నవి. ఈ నాడుల మూలము వలనే రోగనిర్ధారణ చేయవచ్చు.
     
       ఏ రోగము నందు అయినను వాత,పిత్త,శ్లేష్మములు ప్రకోపించి రోగ హేతువులు అగుచున్నవి. రోగి యొక్క మణికట్టు నందు 3 అంగుళాల ప్రదేశము నందు నాడి చలించును. పురుషులకు కుడిచేతి మణికట్టు , ఆడవారికి ఎడమచేతి మణికట్టు నందు పరీక్షించవలెను. బొటనవ్రేలి నందు భూతనాడి , చూపుడువ్రేలు నందు వాతనాడి , మధ్యవ్రేలు నందు పిత్తనాడి , ఉంగరపు వ్రేలు నందు శ్లేష్మనాడి , చిటికిన వ్రేలు నందు గురునాడి చలించును. వాతపిత్తశ్లేష్మనాడులు యే రోగనిర్ణయముకు ఆధారభూతములు . వాతనాడి పామునడక వలే మెలికలుగా జలగ గమనము వలే సంచరించుచుండును. పిత్తనాడి నెమలి వలే హంసవలే చలించుచుండును. శ్లేష్మనాడి ఊరపిచ్చుక వలే , పావురమువలే ,కోడివలే నడుచుచుండును. వాతనాడికి బ్రహ్మయు , పిత్తనాడికి విష్ణువుయు , శ్లేష్మనాడికి పరమేశ్వరుడు అధి దేవతలు .
       
      ఒక్కోసారి రోగ లక్షణములును బట్టికూడా వైద్యం చేయవచ్చు . శరీరం నందు వేడిమి అధికం అయినకొలది చురుకుదనం అధికరించును .అదే శరీరం చల్లదనం అయినచో నాడి చురుకుదనం క్షీణించును. నాడి యొక్క గమనం అధికం అయ్యి వృద్ధినొందునచో గుండె యెక్క కార్యక్రమము చెడుపుచున్నది అని గ్రహించవలెను. ఇది చాలా అనుభవము నందు అలవడును . 

నాడి పరీక్షించు విధానం -
       
     వ్యాధిగ్రస్తుని చేతిని పట్టుకొని మెటికలు విరిచి బొటనవేలు ప్రక్కన , మణికట్టు దాటియున్న స్థలమున నాడి పరీక్షించవలెను. 
పురుషులకు కుడిచేతిని , స్త్రీలకు ఎడమచేతిని పరీక్షించవలెను. అందులో 3 నాడులు పలుకుచుండును. మొదటి నాడి వాతమును , రెండోవది పిత్తమును , మూడొవది శ్లేష్మమును తెలుపును. ఇందులో యేది ఎక్కువ ఉదృతముగా ఉన్నచో ఆ ధాతువు ఎక్కువ ఉన్నది అని తెలుసుకొనవలెను. 
 
వైద్యుడు గమనించవలసిన ముఖ్యవిధి  - 
 
   వైద్యుడు వ్యాధిగ్రస్తునకు మందు ఇచ్చుటకు పూర్వము అతని వయస్సు , వృత్తి , వ్యాధి ఎప్పటినుంచి ఉన్నది , శరీరతత్వము , మల,ముత్ర విసర్జన క్రమము , నాడి మొదలగు వాటిని చక్కగా తెలుసుకొని వయస్సును అనుసరించి మందు ఇవ్వవలెను. 
  

  

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. -

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. - 
 
* బ్రాహ్మము - 
     
మంచి గుణవంతుడు అయిన వరునకు వస్త్రాభరణాలు  ధరింప చేసి పూజించి  కన్యాదానం చేయుట వరదక్షిణం  అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.
 
 * దైవ వివాహం - 
  
  తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట .
 
 * ఆర్షం - 
    
ధర్మార్ధం గా , గోమిదునం ను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం.అనబడు ఒలి అంటే బదులకు బదులు.
 
* ప్రాజాపత్యం - 
      
 నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహం లొ కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట .

 * రాక్షసం - 
     
 కన్య మొరపెట్టుకోనినను వినక బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట . అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి .
 
 * అసురం - 
        
 ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు,
కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.
 
 * గాంధర్వం - 
      
 ప్రేమించి పెళ్లి చేసుకోవడం  .
 
* పైశాచికం - 
   
దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికం గా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.
 
అష్టవిద నాయకలు -
 
* ప్రోషిత భర్త - 
 
    భర్త పరదేశమునకు పోగా ఒంటరి అయి ఉండి పతి ఆగమమున నీరిక్షణ కలది.
 
* ఖండిత - 
 
ఇతర స్త్రీలతో కూడి వచ్చిన సంగతి తెలిసి భర్తని ద్వేషించునది. 
 
 * కలహంతరత - 
   
    భర్తను అవమానపరచి పరితాపం నోన్దునది.
 
 * విప్రలబ్ద -
    
ప్రియుని చూడదలచి సంకేతం తో ప్రియునికి రాయబారం పంపునది.
  
* వాసవ సజ్జిక - 
  
భర్త వచ్చుచున్నాడని సంతొషం తొ భర్త రాకకై శయ్యను అలంకరించు నాయక .
  
* స్వాధీన పతిక - 
    
భర్తను తన చెప్పుచేతుల్లో ఉంచుకోనునుది. గీచిన గీటు దాటని మగాడు కల ఆడది.
 
 * అభిసారిక -
  
బంగారు బొమ్మలా శృంగారించుకొని సంకేత స్థలమునకు వెళ్లు నాయక.
 
 * వరిహోత్కంటిక - 
      
ప్రియుడు ఎంతసేపటికి రాడని విరహాగ్ని చేత తపించ బడు నాయక.

 పెండ్లి అయ్యాక భార్య ఏ నాయకో గ్రహింప మర్మం ఇది.

 వివాహం - 
 
స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .

 వివాహానికి శుభమైన వారములు. - 
 
 సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.
 
వివాహానికి తిధులు - 

 అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.

 వివాహానికి సరైన నక్షత్రాలు. - 
 అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు  రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .

 వివాహ యోగములు - 
 వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పూర్తిగా వర్జించవలెను . మిగిలిన వాటిలో శుభయోగములను తీసుకొనుట ఉత్తమము.

 వివాహ కరణములు -

 వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.

 వివాహ లగ్నం -
  
వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.
 
వివాహనికి మాసములు - 

 వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .
    
  

తెలుగు రాష్ట్రంలోనే న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు..

తెలుగు రాష్ట్రంలోనే న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు............!!
న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. 
అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. 

1. సూర్యుడు..!
1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి!
(శ్రీకాకుళం)
2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి!
(తూర్పు గోదావరి)
4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి!
(కర్నూలు)

2. చంద్రుడు..!
1. గునుగుపూడిలో సోమేశ్వరస్వామి! (భీమ‌వ‌రం).
(ప‌శ్చిమ గోదావ‌రి ) 
2. కోటిప‌ల్లి సోమేశ్వరస్వామి!
(తూర్పుగోదావ‌రి) 
3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి!
పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి!
 (కృష్ణా జిల్లా)
4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు!
(నెల్లూరు)

3. అంగార‌కుడు (కుజుడు)..!
1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి! మ‌రియు చోడ‌వ‌రం
(కృష్ణా జిల్లా)
2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి!మ‌రియు పెద్దాపురం
(తూర్పుగోదావ‌రి)
3.పెద్ద నందిపాడు, నాగులపాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.
(గుంటూరు)
కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురిలాంటి నృసింహ క్షేత్రదర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది.

4. బుధుడు..!
1. ద్వార‌కా తిరుమ‌ల‌!
(ప‌శ్చిమ గోదావ‌రి) 
2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3.శ్రీకాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి!
(చిత్తూరు)

5. బృహ‌స్పతి (గురువు)..!
1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
(గుంటూరు)
2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
(మ‌హ‌బూబ్ న‌గ‌ర్ )
3.కోటిప‌ల్లిలో కోటిలింగేశ్వర స్వామి!
మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి) 
4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి! కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి!
(గుంటూరు)

6. శుక్రుడు..!
1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, 
సింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
(విశాఖ)
2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీదేవి!
(చిత్తూరు)
3. పెంచ‌ల‌కోన ఆదిల‌క్ష్మీదేవి!
(నెల్లూరు)

7. శ‌ని..!
1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు!
(అనంత‌పురం)
3. విజ‌యవాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి!
(కృష్ణా జిల్లా) 
4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి!
(ప్రకాశం)

8. రాహువు, 9. కేతువు..!
1. శ్రీ కాళ‌హ‌స్తి!
(చిత్తూరు)
2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గాదేవి!
(కృష్ణా జిల్లా)
4. సంప‌త్ వినాయ‌క స్వామి!
(విశాఖ) 
5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, 
తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.
(గుంటూరు)

వడదెబ్బ నివారణా యోగాలు -

వడదెబ్బ నివారణా యోగాలు -

 * ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.

 * వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.

 * నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.

 * వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

 * కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.

 * విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.

 * 48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

 * వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

 * తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.

 * తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.

 * నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .

 * చన్నీటితో స్నానం చేయించవలెను .

 * వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .

        వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.