Tuesday, August 4, 2026

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం .

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 
  
   కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 
           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు . అవి 
    1 . కోష్ఠశ్రీత కామల .
 
    2 . శాఖాశ్రీత కామల .
    3 . కుంభ కామల 
      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 
  వ్యాధి లక్షణాలు -
     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 
  1 . కళ్లు పసుపు రంగులో ఉంటాయి.
   2 . శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 
   3 . అన్నం తినాలనిపించదు.
   4 . వాంతులు అవుతాయి.
   5 . కొంతమందిలో దురద వస్తుంది . 
   
  పాటించవలసిన ఆహారనియమాలు -
    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.
  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం - 
 * నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.
 * నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 
 * తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 
 * ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 
 * కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 
 * త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.
 * చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.
        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 
  

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.

                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 

             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .

         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.

       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

 రవి -

   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.

 చంద్రుడు -

   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .

 కుజుడు -

    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .

 బుధుడు -

    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .

 గురుడు -

     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.

  శుక్రుడు -

     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .

  శని -

     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .

         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  

  

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం -

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 

      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 

              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 

 గమనిక - 

    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్, 
ఎండలో అతిగా తిరగడం , ఎక్కువ దూరం నడవడం , అతిగా శ్రమ చేయుట , పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం భుజించటం , నువ్వులు , వెల్లుల్లి , మినుములు , అవిసె ఆకు , కొత్త నీరు , పులిసిన గంజి , వేడి నీరు , గో మూత్రము , తాంబూలం , పెరుగు , రేగిపళ్ళు , నూనె వేపుళ్లు , చింతపండు , కోడిమాంసం , చేదు , లవణ , ఆమ్ల రసాల గల పదార్దాలు నిషిద్దం .

  పైన చెప్పిన ఔషధ యోగాన్ని పాటిస్తూ పథ్యం చేసిన త్వరగా సమస్య నుంచి బయటపడతారు . ఈ ఆహార పథ్యం మీ శరీరంలో వేడి తగ్గేవరకు పాటించి ఆ తరువాత మోతాదులు తగ్గించి తీసుకోవలెను 

  

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట .

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట . 
 
 శుక్లశోణిత సంయోగముచే జనించిన దేహము నందు చర్మము , రక్తము , మాంసం కొవ్వు , ఎముకలు , నరములు గూడుకట్టుకుని ఉన్నవి. మరియు మానవశరీరం నందు 70 వేల నరములు ఉన్నవని శరీరశాస్త్రం తెలుపుతుంది. ఈ నరములు శరీరమున గల లక్షణములను తనచలనములు వలన నిరూపించుచున్నవి ఈ నరముల చలనములే నాడీపరిజ్ఞానముకు మూలాధారములు అయి ఉన్నవి.
     
శరీరమున గల నాడులు 5 నామములతో పిలవబడుచున్నవి . అవి 
   *  భూతనాడి .
   *  వాతనాడి .
   *  పిత్తనాడి .
   *  శ్లేష్మనాడి . 
   *  గురునాడి . 
       
       ఆహారవిహారాదుల యందు మానవుడు సరైన మార్గమము అనుసరించక పోవడం వలెనే రోగములు ఉద్భవించుచున్నవి. ఈ నాడుల మూలము వలనే రోగనిర్ధారణ చేయవచ్చు.
     
       ఏ రోగము నందు అయినను వాత,పిత్త,శ్లేష్మములు ప్రకోపించి రోగ హేతువులు అగుచున్నవి. రోగి యొక్క మణికట్టు నందు 3 అంగుళాల ప్రదేశము నందు నాడి చలించును. పురుషులకు కుడిచేతి మణికట్టు , ఆడవారికి ఎడమచేతి మణికట్టు నందు పరీక్షించవలెను. బొటనవ్రేలి నందు భూతనాడి , చూపుడువ్రేలు నందు వాతనాడి , మధ్యవ్రేలు నందు పిత్తనాడి , ఉంగరపు వ్రేలు నందు శ్లేష్మనాడి , చిటికిన వ్రేలు నందు గురునాడి చలించును. వాతపిత్తశ్లేష్మనాడులు యే రోగనిర్ణయముకు ఆధారభూతములు . వాతనాడి పామునడక వలే మెలికలుగా జలగ గమనము వలే సంచరించుచుండును. పిత్తనాడి నెమలి వలే హంసవలే చలించుచుండును. శ్లేష్మనాడి ఊరపిచ్చుక వలే , పావురమువలే ,కోడివలే నడుచుచుండును. వాతనాడికి బ్రహ్మయు , పిత్తనాడికి విష్ణువుయు , శ్లేష్మనాడికి పరమేశ్వరుడు అధి దేవతలు .
       
      ఒక్కోసారి రోగ లక్షణములును బట్టికూడా వైద్యం చేయవచ్చు . శరీరం నందు వేడిమి అధికం అయినకొలది చురుకుదనం అధికరించును .అదే శరీరం చల్లదనం అయినచో నాడి చురుకుదనం క్షీణించును. నాడి యొక్క గమనం అధికం అయ్యి వృద్ధినొందునచో గుండె యెక్క కార్యక్రమము చెడుపుచున్నది అని గ్రహించవలెను. ఇది చాలా అనుభవము నందు అలవడును . 

నాడి పరీక్షించు విధానం -
       
     వ్యాధిగ్రస్తుని చేతిని పట్టుకొని మెటికలు విరిచి బొటనవేలు ప్రక్కన , మణికట్టు దాటియున్న స్థలమున నాడి పరీక్షించవలెను. 
పురుషులకు కుడిచేతిని , స్త్రీలకు ఎడమచేతిని పరీక్షించవలెను. అందులో 3 నాడులు పలుకుచుండును. మొదటి నాడి వాతమును , రెండోవది పిత్తమును , మూడొవది శ్లేష్మమును తెలుపును. ఇందులో యేది ఎక్కువ ఉదృతముగా ఉన్నచో ఆ ధాతువు ఎక్కువ ఉన్నది అని తెలుసుకొనవలెను. 
 
వైద్యుడు గమనించవలసిన ముఖ్యవిధి  - 
 
   వైద్యుడు వ్యాధిగ్రస్తునకు మందు ఇచ్చుటకు పూర్వము అతని వయస్సు , వృత్తి , వ్యాధి ఎప్పటినుంచి ఉన్నది , శరీరతత్వము , మల,ముత్ర విసర్జన క్రమము , నాడి మొదలగు వాటిని చక్కగా తెలుసుకొని వయస్సును అనుసరించి మందు ఇవ్వవలెను. 
  

  

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. -

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. - 
 
* బ్రాహ్మము - 
     
మంచి గుణవంతుడు అయిన వరునకు వస్త్రాభరణాలు  ధరింప చేసి పూజించి  కన్యాదానం చేయుట వరదక్షిణం  అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.
 
 * దైవ వివాహం - 
  
  తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట .
 
 * ఆర్షం - 
    
ధర్మార్ధం గా , గోమిదునం ను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం.అనబడు ఒలి అంటే బదులకు బదులు.
 
* ప్రాజాపత్యం - 
      
 నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహం లొ కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట .

 * రాక్షసం - 
     
 కన్య మొరపెట్టుకోనినను వినక బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట . అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి .
 
 * అసురం - 
        
 ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు,
కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.
 
 * గాంధర్వం - 
      
 ప్రేమించి పెళ్లి చేసుకోవడం  .
 
* పైశాచికం - 
   
దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికం గా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.
 
అష్టవిద నాయకలు -
 
* ప్రోషిత భర్త - 
 
    భర్త పరదేశమునకు పోగా ఒంటరి అయి ఉండి పతి ఆగమమున నీరిక్షణ కలది.
 
* ఖండిత - 
 
ఇతర స్త్రీలతో కూడి వచ్చిన సంగతి తెలిసి భర్తని ద్వేషించునది. 
 
 * కలహంతరత - 
   
    భర్తను అవమానపరచి పరితాపం నోన్దునది.
 
 * విప్రలబ్ద -
    
ప్రియుని చూడదలచి సంకేతం తో ప్రియునికి రాయబారం పంపునది.
  
* వాసవ సజ్జిక - 
  
భర్త వచ్చుచున్నాడని సంతొషం తొ భర్త రాకకై శయ్యను అలంకరించు నాయక .
  
* స్వాధీన పతిక - 
    
భర్తను తన చెప్పుచేతుల్లో ఉంచుకోనునుది. గీచిన గీటు దాటని మగాడు కల ఆడది.
 
 * అభిసారిక -
  
బంగారు బొమ్మలా శృంగారించుకొని సంకేత స్థలమునకు వెళ్లు నాయక.
 
 * వరిహోత్కంటిక - 
      
ప్రియుడు ఎంతసేపటికి రాడని విరహాగ్ని చేత తపించ బడు నాయక.

 పెండ్లి అయ్యాక భార్య ఏ నాయకో గ్రహింప మర్మం ఇది.

 వివాహం - 
 
స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .

 వివాహానికి శుభమైన వారములు. - 
 
 సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.
 
వివాహానికి తిధులు - 

 అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.

 వివాహానికి సరైన నక్షత్రాలు. - 
 అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు  రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .

 వివాహ యోగములు - 
 వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పూర్తిగా వర్జించవలెను . మిగిలిన వాటిలో శుభయోగములను తీసుకొనుట ఉత్తమము.

 వివాహ కరణములు -

 వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.

 వివాహ లగ్నం -
  
వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.
 
వివాహనికి మాసములు - 

 వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .
    
  

తెలుగు రాష్ట్రంలోనే న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు..

తెలుగు రాష్ట్రంలోనే న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు............!!
న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. 
అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. 

1. సూర్యుడు..!
1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి!
(శ్రీకాకుళం)
2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి!
(తూర్పు గోదావరి)
4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి!
(కర్నూలు)

2. చంద్రుడు..!
1. గునుగుపూడిలో సోమేశ్వరస్వామి! (భీమ‌వ‌రం).
(ప‌శ్చిమ గోదావ‌రి ) 
2. కోటిప‌ల్లి సోమేశ్వరస్వామి!
(తూర్పుగోదావ‌రి) 
3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి!
పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి!
 (కృష్ణా జిల్లా)
4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు!
(నెల్లూరు)

3. అంగార‌కుడు (కుజుడు)..!
1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి! మ‌రియు చోడ‌వ‌రం
(కృష్ణా జిల్లా)
2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి!మ‌రియు పెద్దాపురం
(తూర్పుగోదావ‌రి)
3.పెద్ద నందిపాడు, నాగులపాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.
(గుంటూరు)
కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురిలాంటి నృసింహ క్షేత్రదర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది.

4. బుధుడు..!
1. ద్వార‌కా తిరుమ‌ల‌!
(ప‌శ్చిమ గోదావ‌రి) 
2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3.శ్రీకాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి!
(చిత్తూరు)

5. బృహ‌స్పతి (గురువు)..!
1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
(గుంటూరు)
2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
(మ‌హ‌బూబ్ న‌గ‌ర్ )
3.కోటిప‌ల్లిలో కోటిలింగేశ్వర స్వామి!
మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి) 
4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి! కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి!
(గుంటూరు)

6. శుక్రుడు..!
1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, 
సింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
(విశాఖ)
2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీదేవి!
(చిత్తూరు)
3. పెంచ‌ల‌కోన ఆదిల‌క్ష్మీదేవి!
(నెల్లూరు)

7. శ‌ని..!
1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు!
(అనంత‌పురం)
3. విజ‌యవాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి!
(కృష్ణా జిల్లా) 
4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి!
(ప్రకాశం)

8. రాహువు, 9. కేతువు..!
1. శ్రీ కాళ‌హ‌స్తి!
(చిత్తూరు)
2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గాదేవి!
(కృష్ణా జిల్లా)
4. సంప‌త్ వినాయ‌క స్వామి!
(విశాఖ) 
5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, 
తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.
(గుంటూరు)

వడదెబ్బ నివారణా యోగాలు -

వడదెబ్బ నివారణా యోగాలు -

 * ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.

 * వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.

 * నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.

 * వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

 * కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.

 * విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.

 * 48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

 * వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

 * తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.

 * తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.

 * నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .

 * చన్నీటితో స్నానం చేయించవలెను .

 * వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .

        వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.

  
 

మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .

మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .

మూత్రం అతికష్టంగా బయటకి రావడమే మూత్రకృచ్చ వ్యాధి అంటారు. మూత్రం సాఫీగా ధారాళంగా బయటకి రాకుండా అగిఆగి కొద్దికొద్దిగా అది కూడా చాలా కష్టంగా వస్తుంది .

కారణాలు -

ముత్ర ద్వారంలో కొన్ని రకాల వాయువులు బిగబట్టడం లేదా ఏవైనా వ్యర్ధపదార్ధాలు అడ్డుపడటం వలన మూత్రం కష్టంగా వెలువడుతుంది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు . మనశరీరానికి విరుద్ధమైన ఆహారం సేవించడం వలన శరీరంలో ఎల్లప్పుడూ సమానంగా ఉండవలసిన వాత,పిత్త,కఫ దోషాలు చెడిపోయి అసమానమై ఈ మూడు దోషాలు విడివిడిగా కాని , ఏ రెండు కలిసి అయినా కాని లేక మూడు ఒకేసారి ప్రకోపించి మూత్రాశయంలో ను , మూత్రపిండాలలోను చేరి మూత్రప్రసరణకి ఆటంకం కలిగించడం వలన "మూత్రకృచ్చం " అనే వ్యాధి సంభవిస్తుంది.

నివారణ -

చిన్న ఏలకులు , కొండపిండి చెట్టు సమూలం , కర్పూర శిలాజిత్తు , పిప్పిళ్లు వీటిని సమభాగాలుగా దంచి చూర్ణం కొట్టి పూటకు 6 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగిన నీటితో కలిపి రెండు పూటలా తాగిస్తూ ఉంటే మూత్రం బిగించడం వలన మృత్యుముఖానికి చేరిన రోగులకు కూడా మూత్రం ధారళంగా వెలువడి జీవించగలరు .

నా అనుభవ యోగం -

మూత్రం బిగించి క్షణక్షణంకి కడుపు ఉబ్బుతున్న ఒకరికి తమలపాకు కి ఆముదం పూసి క్యాండిల్ కి దగ్గరగా తమలపాకు పెట్టి వేడి చూపించి పొత్తి కడుపు భాగంపై వేశాను . 10 నిమిషాలలో మూత్రం ధారళంగా వెలువడినది.


కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.

ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను .

కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును .

గమనిక -

మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే .



విషములు వాని లక్షణములు -

విషములు వాని లక్షణములు - 

 మహా విష సర్పములు - 

 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.

 స్థాన విధి దోషము - 

 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.

 నక్షత్ర దోషము - 

 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .

 విష సాధ్య లక్షణములు - 

  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 

 తేలు విషము - 

  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 

 గర విష లక్షణము - 

 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 

 పెట్టుడు మందు లక్షణము - 

 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 

 విషాన్న లక్షణము - 

 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 

 విషము కలిపిన కూరలు - 

 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 

 విషాన్న పరీక్ష - 

  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 

        

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు .
 సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.

     పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .

* శరీర పరీక్ష నేర్చుకునే విధానము.-
 
     పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను.

* చేదన కర్మం -
 సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .

* బేధ్య కర్మం -
 
    నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .
* లేఖ్య కర్మం -
 
   రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .

* వేద్య కర్మం -
 మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .

* ఏష్య కర్మం -
 
  పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .

* ఆహార కర్మం -
 
పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.

* విశ్రావ్య కర్మం -
 విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .

* సీస కర్మం -
 మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను .

స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు -
 
   కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.

 శస్త్ర చికిత్స చేయు విదానం -

    శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.-

• శస్త్రములు - ( Inustruments , Lancet etc .)
• యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)
• క్షారము - ( Alkali) .
• అగ్ని - ( Fire for cauterisation) .
• జలూక - ( Leeches) .
• శలాక - ( Probe or direetor ).
• జాంబ వోష్ణము -( CavtersingInusruments) .
• పిచువు - (Cotton) .
• ప్లోతము - ( Lint) .
• సూత్రము - (Thread) .
• పట్టము - ( Tow ).
• తేనే - ( Honey) .
• నెయ్యి - ( Ghee) .
• కొవ్వు.
• పాలు.
• నూనే .
• తర్పణం - ( powederd wheat soaked inwater ) .
• కషాయం - ( Decoctions) .
• అలేపము - ( Medicated Plasters) .
• కల్కము - ( Paste) .
• చన్నీళ్ళు.
• వేడి నీళ్ళు .
• కవలిక - ( Splints) .
• వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).
• స్పటికం - ( Lens) .
• కురువింద రాళ్ళు .
• అయస్కాన్థములు .
• గాజు తునకలు.
• టేకు ఆకులు. మరియు మత్తు కలగ చేయు పదార్దం
   
     పైన చెప్పిన విధముగా రకరకాల పరికరాలు ఉపయోగించి అత్యంత నైపుణ్యతతో మన పూర్వికులు శస్త్రచికిత్సలు చేసెడివారు .  


భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

. మన ప్రాచీన భారతీయుల విఙ్ఞానం అమోఘమైనది . వారు పరిశోధించి కనుగొనిన అనేక అంశాలు అత్యంత రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు . మన భారతీయ వేదాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తం అయ్యి ఉంది. కాని మనం దానిని పట్టించుకోకుండా పాశ్చాత్త్యా సంప్రదాయాల మోజులో పడిపోయి మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం పట్టించుకోవడం లేదు . తాళపత్రాలలో మరియు మన పురాతన గ్రంథాలలో నిక్షిప్తం అయిన అద్బుత విజ్ఞానాన్ని వారు తమ తమ పరిశోధనలలో ఉపయోగించుకుంటున్నారు. మనం పోగొట్టుకున్న ఒక అద్భుత రహస్య విద్య గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.
 
. మనం పోగుట్టుకున్న , మరిచిపోయిన ఆ రహస్య విద్య పేరే "రసవాద విద్య" ఈ విద్య గురించి వివరించాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ విద్యలో ముఖ్యంగా చెట్ల రసాలు , పాదరసం వంటి లోహాలు ఉపయోగించి "బంగారం " తయారుచేయుట . రహస్యంగా ఉండిపోయిన ఈ విద్య గురించి కొంత సమాచారమును నేను సేకరించాను . కొన్ని పురాతన గ్రంథాలను కూడా నేను ఈ విద్య గురించి తెలుసుకోవడానికి చదవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విశేషాలు తెలియచేస్తాను. అగస్త్య మహర్షులవారు అగస్త్యప్రోక్తం అను రసాయనిక గ్రంధమును రచించి అందులో పాషాణ , రససమ్మేళణాదులు ఉపయోగించు విధానం పేర్కొనెను. నీచలోహాలను స్వర్ణముగా మార్చు విధానములు సవివరముగా తెలియచేస్తూ రసవాదులకు మార్గదర్శకుడు అయ్యెను . ఈ రసవాదం సంపూర్ణంగా సిద్ధించుటకు అత్యంత ప్రజ్ఞ కలవాడై ఉండవలెను . పురాతన సిద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది ఆధునిక రసవాద పరిశోధకులు కూడా స్వర్ణాన్ని తయారుచేశారు. వారిలో కాశీ నివాసి "పండిత్ కృష్ణపాల్ " 1943 సంవత్సరంలో హృషికేష్ లోని ప్రముఖుల సమక్షాన రసవాద విద్య ద్వారా స్వర్ణాన్ని తయారుచేశారు. ఆ బంగారం ఆ కాలంలో 72000 రూపాయలకు విక్రయించబడినది. ఆ మొత్తం పంజాబ్ లోని సనాతన ధర్మ ప్రతినిధి సభకు విరాళంగా ఇవ్వబడినది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వనాధ మందిరం పై అంతస్తులో రసవాద విద్యలో ప్రముఖ ఆచార్యుడు అయిన నాగార్జుని చిత్రంతో పాటు పాలరాతిపై ఈ వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి . 11 వ శతాబ్దంలో "ఆల్బెరుని " అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడి సిద్దులు బంగారం తయారుచేసేవారు అని పేర్కొన్నాడు. దేశంలో కరువుకాటకాలు ఏర్పడినపుడు రసాయనాచార్యులు కృత్రిమంగా స్వర్ణాన్ని తయారుచేసెవారు అని అనేక గ్రంథాలలో వివరించబడి ఉంది. ఈ రసవాద విద్యను "స్వర్ణకరణి" పగారవిద్య అని అంటారు. ఈ విద్యను ఉర్దూలో కీమియా అని ఇంగ్లిష్ భాషలో ఆల్కెమీ అని పిలుస్తారు . ఈ రసవాదవిద్యలో నీచ వస్తువుని స్వర్ణంగా మార్చడానికి ఉపయోగించు ఒక వస్తువును "పరుసవేది " అని పిలుస్తారు . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ రసవాద విద్య సిద్దించక భ్రష్టుడు , పిచ్చివాడు కావొచ్చేమోకాని ఒక గొప్ప వైద్యుడు మాత్రం తప్పక అవుతాడు. అందుకనే మన పూర్వీకులు " వాదభ్రష్టో వైద్య శ్రేష్ఠ" అని అన్నారు. ఆధునిక శాస్త్రవేత్తలు స్వర్ణం తయారుచేయడాన్ని ఒక పిచ్చిపనిగా , చెప్పినవాడ్ని పిచ్చివానిగా చూస్తారు. వారు చెప్పినట్లు స్వర్ణం ఒక ఎలిమెంట్ అణుసంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 . AU కాంతి లోహ సంబంధమైనది . ప్రకృతిసిద్ధంగా లభించే బంగారుస్పటికముల అవయవ రూపత్వం ఇసొమెట్రిక్ భూమి యొక్క ఉష్ణోగ్రతకు కరిగి కిందికి దిగి పేరుకుని పొందే అవయవాకృతిని "నగ్గెట్స్" అంటారు. బంగారం యొక్క కాఠిన్యం 2 .5 to 3 .రష్యా వంటి దేశాలలో ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారుచేశారు. బయట ఉన్న బంగారం ఖరీదు కంటే తయారు చేయుటకు అయ్యే వ్యయం ఎక్కువ ఆగుతుంది. అందువల్ల పరిశోధనలు ఆగిపోయాయి. భారతీయ పురాణాల్లో చెప్పినదాని ప్రకారం ఈ రసవాద విద్యలో ప్రముఖులు ఆదిమ చంద్రసేనుడు , లంకేశ్వరుడు, మత్తమాండవ్య ఇంద్రదత్త , కలంబి, నాగార్జునుడు, ఋషిశృంగ, రసేంద్రాతిలక , భాలుకి , మైధిలి , హరీశ్వర మొదలగు 27 మహామహులు చేత సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్భాటాచార్యుడు , వేమనయోగి వంటి ఎందరో మహాత్ములు , సిద్దులు మొదలయిన వారు ఎందరొ ఉన్నారు. మనకు తెలిసిన వేమన గొప్ప రసవాది ఆయన ఒక చోట ఇలా చెప్పాడు . " వెన్నెల నిలుచుండి , వేపాకు పడవేసి అడ్డసరం రసమందు నదియు పిండి రాగి కరుగవేయ రమణ బంగారమౌ విశ్వదాభిరామ " అని చెప్పాడు . మరియొక చోట " పుట్టమీద కాయ , పుట్టమీద మన్ను పుట్టలోనివాని పుట్టుతుదను గట్టియవచనము కాంచనాంబగయ" అని చెప్పాడు. నేపాల్ దేశంలో పరుశువేది లింగం ఉన్నట్టు శ్రీశైల క్షేత్రంలో కూడా శివలింగానికి కింద ఉన్న సప్తమ లింగం కూడా పరశువేది లింగం అంటూ కొన్ని ప్రాచీన రహస్య గ్రంధాలలో ఉన్నది.
రసవాద విద్య గురించి సంపూర్ణంగా వివరించే అత్యంత ప్రాచీన గ్రంథాలు -
గ్రంధాల పేర్లు -

• అగస్త్య రసాయనిక తంత్రం.
• కక్షపూట తంత్రం.
• కూపిపక్వ రస నిర్మాణ్ విజ్ఞాన్.
• ద్వాదశ లోహ భస్మ విధానము.
• పారద విజ్ఞానం.
• పారద సంహిత.
• రస చింతామణి.
• రసరత్నాకరము .
• రసాయన ఖండం.
• రసార్ణవము.
• రసేంద్ర చూడామణి.
• రసేంద్ర కల్పద్రుమ.
• సనారి విశ్వేశ్వర సంవాదం.
• రస కంకాలియ.
• రస కౌముది.
• రస పారిజాత.
• రసరత్న మణిమాల.
• రస ప్రదీప.
• రసేంద్ర మంగళం .
• సూత ప్రదీపిక.
• రస సాగరః.
• రస రాజలక్ష్మి.
• రస ముక్తావళి.
• రసరాజ శిరోమణి.
• రస సంగ్రహ సిద్ధాంత .
• రస కిన్నెర .
• స్వర్ణ తంత్రం.
• కనకమంజరి.
• కళాయి శాస్త్రం. పైన చెప్పిన గ్రంథాలు అత్యంత ప్రాచీనం అయినవి . ఇంకా కొన్నిచోట్ల అరుదుగా లభ్యం అగుచున్నవి.

 రసవాదం నందు వివరించిన కొన్ని ప్రయోగాలు -

• తెల్ల వాకుడు రసం తో పాదరసాన్ని నూరిన మైనం . ఆ మైనంలో ఆ పిప్పిలో పొదిగి , ఆరబెట్టి చిన్న పుటం పుట్టిన భస్మం అగును. రాగిని కరిగించి అందులో ఈ భస్మం వేసిన హేమించును

• ఒక శేరు ఇంగిలీకమును 5 శేరుల పచ్చిపసుపు రసమున 4 జాములు చురకా ఇచ్చి తరువాత 15 శేరుల తంగేడుపువ్వుల రసముతో చురకా ఇచ్చిన కట్టును . ఇది నిశ్చయం. అది వెండి మీద పదోవంతు వేసిన బంగారం అగును.

• అడవి మెంతి ఆకు పాదరసమున వేసి నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం వేసిన వెండి అగును ఇది నిశ్చయం .

• శంఖు పాషాణం వంకాయలో పెట్టి మట్టిరాసి ఆరబెట్టి 21 పుటములు పెట్టవలెను . 10 పుటముల వరకు 4 నుంచి 5 వేసినను కట్టును . తరువాత 4 కి 1 పిడక చొప్పున పుటములు పెట్టవలెను. దీనిని రసంలో వేసి రాగికి జోడించి కరిగించిన స్వర్ణం అగును.

• నల్ల ఉమ్మెత్త సమూలం నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం పెట్టిన భస్మం అగును. ఆ భస్మమును రాగి కరుగుచుండగా వేసిన స్వర్ణం అగును. శుద్ధ రాగి కొరకు నైజామ్ అర్ధరూపాయి వెడల్పాటిది శ్రేష్టం.

• రెండు నేరేడు పండ్లు తెచ్చి ఒక్కోటి సగం వరకు కోసి కొంచం గుజ్జు తీసి రెండు తులముల రాగి రజను అందులో పోసి తీసిన గుజ్జు మీద వేసి రెండు డిప్పలు కలిపి గుడ్డ చుట్టి 7 సార్లు శీలమన్ను ఇవ్వవలెను . పిమ్మట ఏరు పిడకలతో పుఠం పెట్టి సాంగశీతలమున బలి ఇచ్చి తీసి చూచిన 6 వన్నె బంగారం అగును .కరిగించి దూచిన సరిపోవును .పైన చెప్పిన యోగాలు కొన్ని ప్రాచీన అత్యంత అరుదయిన గ్రంథాల నుంచి నేను సేకరించినవి . ఇవి కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే వివరిస్తున్నాను. అత్యాశకు పోయి మీకుటుంబాలను , మీ మీద ఆధారపడ్డ వారిని ఇబ్బందులపాలు చేయొద్దని నా మనవి. ఆ సర్వేశ్వరుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు . కావున ఇచ్చినదానితో తృప్తిగా కుటుంబంతో సంతోషంగా ఉందాం. 

    

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు -

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 

 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.

 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .

 * యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.

 * బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .

 * పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .

 * కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.

         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.

 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -

 తినవలసినవి -

 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .

 తినకూడనవి -

        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .

        పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.