Tuesday, August 4, 2026

మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .

మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .

మూత్రం అతికష్టంగా బయటకి రావడమే మూత్రకృచ్చ వ్యాధి అంటారు. మూత్రం సాఫీగా ధారాళంగా బయటకి రాకుండా అగిఆగి కొద్దికొద్దిగా అది కూడా చాలా కష్టంగా వస్తుంది .

కారణాలు -

ముత్ర ద్వారంలో కొన్ని రకాల వాయువులు బిగబట్టడం లేదా ఏవైనా వ్యర్ధపదార్ధాలు అడ్డుపడటం వలన మూత్రం కష్టంగా వెలువడుతుంది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు . మనశరీరానికి విరుద్ధమైన ఆహారం సేవించడం వలన శరీరంలో ఎల్లప్పుడూ సమానంగా ఉండవలసిన వాత,పిత్త,కఫ దోషాలు చెడిపోయి అసమానమై ఈ మూడు దోషాలు విడివిడిగా కాని , ఏ రెండు కలిసి అయినా కాని లేక మూడు ఒకేసారి ప్రకోపించి మూత్రాశయంలో ను , మూత్రపిండాలలోను చేరి మూత్రప్రసరణకి ఆటంకం కలిగించడం వలన "మూత్రకృచ్చం " అనే వ్యాధి సంభవిస్తుంది.

నివారణ -

చిన్న ఏలకులు , కొండపిండి చెట్టు సమూలం , కర్పూర శిలాజిత్తు , పిప్పిళ్లు వీటిని సమభాగాలుగా దంచి చూర్ణం కొట్టి పూటకు 6 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగిన నీటితో కలిపి రెండు పూటలా తాగిస్తూ ఉంటే మూత్రం బిగించడం వలన మృత్యుముఖానికి చేరిన రోగులకు కూడా మూత్రం ధారళంగా వెలువడి జీవించగలరు .

నా అనుభవ యోగం -

మూత్రం బిగించి క్షణక్షణంకి కడుపు ఉబ్బుతున్న ఒకరికి తమలపాకు కి ఆముదం పూసి క్యాండిల్ కి దగ్గరగా తమలపాకు పెట్టి వేడి చూపించి పొత్తి కడుపు భాగంపై వేశాను . 10 నిమిషాలలో మూత్రం ధారళంగా వెలువడినది.


కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.

ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను .

కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును .

గమనిక -

మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే .



విషములు వాని లక్షణములు -

విషములు వాని లక్షణములు - 

 మహా విష సర్పములు - 

 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.

 స్థాన విధి దోషము - 

 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.

 నక్షత్ర దోషము - 

 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .

 విష సాధ్య లక్షణములు - 

  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 

 తేలు విషము - 

  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 

 గర విష లక్షణము - 

 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 

 పెట్టుడు మందు లక్షణము - 

 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 

 విషాన్న లక్షణము - 

 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 

 విషము కలిపిన కూరలు - 

 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 

 విషాన్న పరీక్ష - 

  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 

        

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు .
 సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.

     పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .

* శరీర పరీక్ష నేర్చుకునే విధానము.-
 
     పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను.

* చేదన కర్మం -
 సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .

* బేధ్య కర్మం -
 
    నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .
* లేఖ్య కర్మం -
 
   రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .

* వేద్య కర్మం -
 మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .

* ఏష్య కర్మం -
 
  పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .

* ఆహార కర్మం -
 
పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.

* విశ్రావ్య కర్మం -
 విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .

* సీస కర్మం -
 మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను .

స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు -
 
   కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.

 శస్త్ర చికిత్స చేయు విదానం -

    శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.-

• శస్త్రములు - ( Inustruments , Lancet etc .)
• యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)
• క్షారము - ( Alkali) .
• అగ్ని - ( Fire for cauterisation) .
• జలూక - ( Leeches) .
• శలాక - ( Probe or direetor ).
• జాంబ వోష్ణము -( CavtersingInusruments) .
• పిచువు - (Cotton) .
• ప్లోతము - ( Lint) .
• సూత్రము - (Thread) .
• పట్టము - ( Tow ).
• తేనే - ( Honey) .
• నెయ్యి - ( Ghee) .
• కొవ్వు.
• పాలు.
• నూనే .
• తర్పణం - ( powederd wheat soaked inwater ) .
• కషాయం - ( Decoctions) .
• అలేపము - ( Medicated Plasters) .
• కల్కము - ( Paste) .
• చన్నీళ్ళు.
• వేడి నీళ్ళు .
• కవలిక - ( Splints) .
• వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).
• స్పటికం - ( Lens) .
• కురువింద రాళ్ళు .
• అయస్కాన్థములు .
• గాజు తునకలు.
• టేకు ఆకులు. మరియు మత్తు కలగ చేయు పదార్దం
   
     పైన చెప్పిన విధముగా రకరకాల పరికరాలు ఉపయోగించి అత్యంత నైపుణ్యతతో మన పూర్వికులు శస్త్రచికిత్సలు చేసెడివారు .  


భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

. మన ప్రాచీన భారతీయుల విఙ్ఞానం అమోఘమైనది . వారు పరిశోధించి కనుగొనిన అనేక అంశాలు అత్యంత రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు . మన భారతీయ వేదాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తం అయ్యి ఉంది. కాని మనం దానిని పట్టించుకోకుండా పాశ్చాత్త్యా సంప్రదాయాల మోజులో పడిపోయి మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం పట్టించుకోవడం లేదు . తాళపత్రాలలో మరియు మన పురాతన గ్రంథాలలో నిక్షిప్తం అయిన అద్బుత విజ్ఞానాన్ని వారు తమ తమ పరిశోధనలలో ఉపయోగించుకుంటున్నారు. మనం పోగొట్టుకున్న ఒక అద్భుత రహస్య విద్య గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.
 
. మనం పోగుట్టుకున్న , మరిచిపోయిన ఆ రహస్య విద్య పేరే "రసవాద విద్య" ఈ విద్య గురించి వివరించాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ విద్యలో ముఖ్యంగా చెట్ల రసాలు , పాదరసం వంటి లోహాలు ఉపయోగించి "బంగారం " తయారుచేయుట . రహస్యంగా ఉండిపోయిన ఈ విద్య గురించి కొంత సమాచారమును నేను సేకరించాను . కొన్ని పురాతన గ్రంథాలను కూడా నేను ఈ విద్య గురించి తెలుసుకోవడానికి చదవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విశేషాలు తెలియచేస్తాను. అగస్త్య మహర్షులవారు అగస్త్యప్రోక్తం అను రసాయనిక గ్రంధమును రచించి అందులో పాషాణ , రససమ్మేళణాదులు ఉపయోగించు విధానం పేర్కొనెను. నీచలోహాలను స్వర్ణముగా మార్చు విధానములు సవివరముగా తెలియచేస్తూ రసవాదులకు మార్గదర్శకుడు అయ్యెను . ఈ రసవాదం సంపూర్ణంగా సిద్ధించుటకు అత్యంత ప్రజ్ఞ కలవాడై ఉండవలెను . పురాతన సిద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది ఆధునిక రసవాద పరిశోధకులు కూడా స్వర్ణాన్ని తయారుచేశారు. వారిలో కాశీ నివాసి "పండిత్ కృష్ణపాల్ " 1943 సంవత్సరంలో హృషికేష్ లోని ప్రముఖుల సమక్షాన రసవాద విద్య ద్వారా స్వర్ణాన్ని తయారుచేశారు. ఆ బంగారం ఆ కాలంలో 72000 రూపాయలకు విక్రయించబడినది. ఆ మొత్తం పంజాబ్ లోని సనాతన ధర్మ ప్రతినిధి సభకు విరాళంగా ఇవ్వబడినది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వనాధ మందిరం పై అంతస్తులో రసవాద విద్యలో ప్రముఖ ఆచార్యుడు అయిన నాగార్జుని చిత్రంతో పాటు పాలరాతిపై ఈ వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి . 11 వ శతాబ్దంలో "ఆల్బెరుని " అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడి సిద్దులు బంగారం తయారుచేసేవారు అని పేర్కొన్నాడు. దేశంలో కరువుకాటకాలు ఏర్పడినపుడు రసాయనాచార్యులు కృత్రిమంగా స్వర్ణాన్ని తయారుచేసెవారు అని అనేక గ్రంథాలలో వివరించబడి ఉంది. ఈ రసవాద విద్యను "స్వర్ణకరణి" పగారవిద్య అని అంటారు. ఈ విద్యను ఉర్దూలో కీమియా అని ఇంగ్లిష్ భాషలో ఆల్కెమీ అని పిలుస్తారు . ఈ రసవాదవిద్యలో నీచ వస్తువుని స్వర్ణంగా మార్చడానికి ఉపయోగించు ఒక వస్తువును "పరుసవేది " అని పిలుస్తారు . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ రసవాద విద్య సిద్దించక భ్రష్టుడు , పిచ్చివాడు కావొచ్చేమోకాని ఒక గొప్ప వైద్యుడు మాత్రం తప్పక అవుతాడు. అందుకనే మన పూర్వీకులు " వాదభ్రష్టో వైద్య శ్రేష్ఠ" అని అన్నారు. ఆధునిక శాస్త్రవేత్తలు స్వర్ణం తయారుచేయడాన్ని ఒక పిచ్చిపనిగా , చెప్పినవాడ్ని పిచ్చివానిగా చూస్తారు. వారు చెప్పినట్లు స్వర్ణం ఒక ఎలిమెంట్ అణుసంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 . AU కాంతి లోహ సంబంధమైనది . ప్రకృతిసిద్ధంగా లభించే బంగారుస్పటికముల అవయవ రూపత్వం ఇసొమెట్రిక్ భూమి యొక్క ఉష్ణోగ్రతకు కరిగి కిందికి దిగి పేరుకుని పొందే అవయవాకృతిని "నగ్గెట్స్" అంటారు. బంగారం యొక్క కాఠిన్యం 2 .5 to 3 .రష్యా వంటి దేశాలలో ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారుచేశారు. బయట ఉన్న బంగారం ఖరీదు కంటే తయారు చేయుటకు అయ్యే వ్యయం ఎక్కువ ఆగుతుంది. అందువల్ల పరిశోధనలు ఆగిపోయాయి. భారతీయ పురాణాల్లో చెప్పినదాని ప్రకారం ఈ రసవాద విద్యలో ప్రముఖులు ఆదిమ చంద్రసేనుడు , లంకేశ్వరుడు, మత్తమాండవ్య ఇంద్రదత్త , కలంబి, నాగార్జునుడు, ఋషిశృంగ, రసేంద్రాతిలక , భాలుకి , మైధిలి , హరీశ్వర మొదలగు 27 మహామహులు చేత సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్భాటాచార్యుడు , వేమనయోగి వంటి ఎందరో మహాత్ములు , సిద్దులు మొదలయిన వారు ఎందరొ ఉన్నారు. మనకు తెలిసిన వేమన గొప్ప రసవాది ఆయన ఒక చోట ఇలా చెప్పాడు . " వెన్నెల నిలుచుండి , వేపాకు పడవేసి అడ్డసరం రసమందు నదియు పిండి రాగి కరుగవేయ రమణ బంగారమౌ విశ్వదాభిరామ " అని చెప్పాడు . మరియొక చోట " పుట్టమీద కాయ , పుట్టమీద మన్ను పుట్టలోనివాని పుట్టుతుదను గట్టియవచనము కాంచనాంబగయ" అని చెప్పాడు. నేపాల్ దేశంలో పరుశువేది లింగం ఉన్నట్టు శ్రీశైల క్షేత్రంలో కూడా శివలింగానికి కింద ఉన్న సప్తమ లింగం కూడా పరశువేది లింగం అంటూ కొన్ని ప్రాచీన రహస్య గ్రంధాలలో ఉన్నది.
రసవాద విద్య గురించి సంపూర్ణంగా వివరించే అత్యంత ప్రాచీన గ్రంథాలు -
గ్రంధాల పేర్లు -

• అగస్త్య రసాయనిక తంత్రం.
• కక్షపూట తంత్రం.
• కూపిపక్వ రస నిర్మాణ్ విజ్ఞాన్.
• ద్వాదశ లోహ భస్మ విధానము.
• పారద విజ్ఞానం.
• పారద సంహిత.
• రస చింతామణి.
• రసరత్నాకరము .
• రసాయన ఖండం.
• రసార్ణవము.
• రసేంద్ర చూడామణి.
• రసేంద్ర కల్పద్రుమ.
• సనారి విశ్వేశ్వర సంవాదం.
• రస కంకాలియ.
• రస కౌముది.
• రస పారిజాత.
• రసరత్న మణిమాల.
• రస ప్రదీప.
• రసేంద్ర మంగళం .
• సూత ప్రదీపిక.
• రస సాగరః.
• రస రాజలక్ష్మి.
• రస ముక్తావళి.
• రసరాజ శిరోమణి.
• రస సంగ్రహ సిద్ధాంత .
• రస కిన్నెర .
• స్వర్ణ తంత్రం.
• కనకమంజరి.
• కళాయి శాస్త్రం. పైన చెప్పిన గ్రంథాలు అత్యంత ప్రాచీనం అయినవి . ఇంకా కొన్నిచోట్ల అరుదుగా లభ్యం అగుచున్నవి.

 రసవాదం నందు వివరించిన కొన్ని ప్రయోగాలు -

• తెల్ల వాకుడు రసం తో పాదరసాన్ని నూరిన మైనం . ఆ మైనంలో ఆ పిప్పిలో పొదిగి , ఆరబెట్టి చిన్న పుటం పుట్టిన భస్మం అగును. రాగిని కరిగించి అందులో ఈ భస్మం వేసిన హేమించును

• ఒక శేరు ఇంగిలీకమును 5 శేరుల పచ్చిపసుపు రసమున 4 జాములు చురకా ఇచ్చి తరువాత 15 శేరుల తంగేడుపువ్వుల రసముతో చురకా ఇచ్చిన కట్టును . ఇది నిశ్చయం. అది వెండి మీద పదోవంతు వేసిన బంగారం అగును.

• అడవి మెంతి ఆకు పాదరసమున వేసి నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం వేసిన వెండి అగును ఇది నిశ్చయం .

• శంఖు పాషాణం వంకాయలో పెట్టి మట్టిరాసి ఆరబెట్టి 21 పుటములు పెట్టవలెను . 10 పుటముల వరకు 4 నుంచి 5 వేసినను కట్టును . తరువాత 4 కి 1 పిడక చొప్పున పుటములు పెట్టవలెను. దీనిని రసంలో వేసి రాగికి జోడించి కరిగించిన స్వర్ణం అగును.

• నల్ల ఉమ్మెత్త సమూలం నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం పెట్టిన భస్మం అగును. ఆ భస్మమును రాగి కరుగుచుండగా వేసిన స్వర్ణం అగును. శుద్ధ రాగి కొరకు నైజామ్ అర్ధరూపాయి వెడల్పాటిది శ్రేష్టం.

• రెండు నేరేడు పండ్లు తెచ్చి ఒక్కోటి సగం వరకు కోసి కొంచం గుజ్జు తీసి రెండు తులముల రాగి రజను అందులో పోసి తీసిన గుజ్జు మీద వేసి రెండు డిప్పలు కలిపి గుడ్డ చుట్టి 7 సార్లు శీలమన్ను ఇవ్వవలెను . పిమ్మట ఏరు పిడకలతో పుఠం పెట్టి సాంగశీతలమున బలి ఇచ్చి తీసి చూచిన 6 వన్నె బంగారం అగును .కరిగించి దూచిన సరిపోవును .పైన చెప్పిన యోగాలు కొన్ని ప్రాచీన అత్యంత అరుదయిన గ్రంథాల నుంచి నేను సేకరించినవి . ఇవి కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే వివరిస్తున్నాను. అత్యాశకు పోయి మీకుటుంబాలను , మీ మీద ఆధారపడ్డ వారిని ఇబ్బందులపాలు చేయొద్దని నా మనవి. ఆ సర్వేశ్వరుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు . కావున ఇచ్చినదానితో తృప్తిగా కుటుంబంతో సంతోషంగా ఉందాం. 

    

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు -

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 

 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.

 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .

 * యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.

 * బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .

 * పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .

 * కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.

         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.

 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -

 తినవలసినవి -

 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .

 తినకూడనవి -

        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .

        పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.

         

Tuesday, May 12, 2026

హనుమాన్ చాలీసా పై... *ప్రశ్నలు, సమాధానములు

14e4;125f8;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

    *హనుమాన్ చాలీసా పై...*                    
       *ప్రశ్నలు, సమాధానములు!*
                   ➖➖➖✍️


*1. చాలీసా" అంటే ఏమిటి?* ``` 
జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు(చాలిస్ అంటే హిందీ లో 40 అని.)```

*2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?*```
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. ‘అజ్ఞానమును’ హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.```

*3. ఆంజనేయ - అర్థం?*```
జ. ఆంజనేయ అంటే... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం, జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.```

*4. తులసీదాస్ అస్సలు పేరు?*```
జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.```

*5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?*```
జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్యవల్ల వచ్చిన తేజో వర్చస్సు యే “సువర్చల”.
ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.```

*6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి?*```
జ. ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్’ 
హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.```

*7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?*```
జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.```

*8. హనుమంతుని పంచ ముఖములు ఏవి?*```
జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు, హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే...తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం గరుడ ముఖం. అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం వరాహ ముఖం. అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది.

9. “జయ” హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?
జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.

10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?
జ.126 సం.జీవించాడు.

11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? 
జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.

12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.

13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో.

14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.

15. కపీశ అంటే అర్థం ఏమిటి?
జ. కపీశ అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.

16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏

17. హనుమ రామదూత ఎలా అయ్యాడు ?
జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే  
అగ్ని ముఖావై దేవాః. 
దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు.

18 . అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ?
జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం.

19 . ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?
జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ.

20 . నామస్మరణ మహిమ ఏమిటి?
జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.

21. మహాత్ముడు అంటే ఎవరు ?
జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని తానే నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 

22 . ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి? 
జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.

23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి?
జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.

24 . విక్రమ అంటే అర్థం ఏమిటి?
జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.

25. సూక్ష్మరూపం ఎప్పుడు ధరించాడు ?
జ. లంకా ప్రవేశ సమయంలో పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు .

26. వికటరూపం అంటే ఏమిటి ?
జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో చూపుతాడు.

27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?
జ. లంకా దహన సమయంలో హనుమ తత్వాన్ని చూస్తాము.

28. భీమరూపధారిగా ఎపుడు వున్నాడు?
జ. అసుర సంహారం లో , ఉగ్రమైనదే భీమ రూపం .

29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?
జ. తనదైన ముద్రతో దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని రావణుడు భయపడాలి అని భావించి లంకా దహనం చేసాడు.

30. అశోకవన నాశనానికి ప్రతిగా రావణుడు హనుమకి ఇచ్చిన దండన ఏది? 
జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు) .

31. రఘువీరుడు ఎందుకు సంతోషించాడు ?
జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం వల్ల లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.

32. అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?
జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.

33. భీముడు హనుమని కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?
జ. మహత్ రూపం చూపమని అడుగుతాడు.

34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?
జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం నేర్చుకున్నపుడు, అశోకవనంలో సీతమ్మ దగ్గర మొత్తం మూడు సార్లు తనమహత్ రూపాన్ని చూపాడు.
(సహస్ర వదన తుంహరో యశ గానై---1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)🙏🙏

35. హనుమంతుని జన్మదినం రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది? 
జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.

36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?
జ)` *హ* 'లో 'అ', *ను'* లో 'ఉ', ' *మ* ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.

 37. భజరంగీ అంటుంటాం - ఎందుకు? 
జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.

38. తుమ్హారో మంత్ర విభీషణ మానా .. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?
జ) రావణాసురుని కొలువులో రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం లేక వినడు కానీ అక్కడే ఉండి విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహరచన.

39. అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?
జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు రాళ్లతో కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు. నీవు కూల్చలేని సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం వదిలేస్తా నంటాడు అర్జునుడు. అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు ,మరి అర్జునుడు ? అని అడిగితే , అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి అలా కారణమై నాడు.

యుద్ధసమయంలో అర్జునుడు కృష్ణునితో అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం వెల్లడిస్తాడు కృష్ణుడు.🙏🙏🙏🙏

40 . హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?
జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.

41 . సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 
జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.
పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు.ఆ సుందరుని గురించి చెప్పేదే సుందరాకాండ.

పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.అటువంటి సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.

హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ. 

పరబ్రహ్మ తత్వమే, *సత్యం శివం సుందరం.* అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక *సుందర* *కాండ* . 

42. చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?
జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.

43. రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?

జ. *బ్రహ్మ పదవి.* 

పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా బ్రహ్మ లోకం వెళ్లి బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి (20) బాహువుల హనుమ దర్శనమిస్తాడు. దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో మన గా చూస్తే అందులో చాలా ముద్రికలు ఉన్నాయి . ఎన్నో కల్పాలు ఎందరో రాములు. నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.

 బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.

తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే , బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.అప్పుడు రాబోయే కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.

*వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.* 
20 చేతులలో *ఖడ్గం* , **డాలు,మొనగలిగిన ఆయుధం,పరశువు,పాశం,* *త్రిశూలం,వృక్షం,చక్రం, శంఖం, గద, ఫలం,అంకుశం,అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార),పుస్తకం,ధనుస్సు,సర్పం* , **ఢమరుకం* ధరించి వున్నాడు.

అటువంటి హనుమకు బ్రహ్మతో సహా మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం.✍️```

**రామ లక్ష్మణ జానకీ** **హనుమాన్ కిజై*
 *జై హనుమాన్* ,* 
 *జై జై హనుమాన్.**
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀