Friday, April 25, 2025

క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -

క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -
      
   క్రిములు అనేవి అజీర్ణవ్యాధి వలన కలుగును. పాశ్చాత్య వైద్యులు ఆయుర్వేద శాస్త్రము నందు క్రిముల విషయము క్రిముల గురించి ఎక్కడా ఇవ్వలేదు , చెప్పబడలేదు అని , క్రిములకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉండలేదని పొరపాటు అభిప్రాయముతో ఉన్నారు . ఆయుర్వేదం నందు క్రిమివ్యాధులకు కూడా అవసరం ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం నందు క్రిముల గురించి ఏమి చెప్పారో మీకు సంపూర్ణముగా వివరిస్తాను. ఇదే విషయము పైన అంతకు ముందు నేను మీకు ఒక పోస్టులో కొంత వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు వివరిస్తాను. 
    
    ఆయుర్వేదం నందు క్రిములను రెండురకాలుగా విభజించారు. అవి 
           
. 1 - బాహ్యక్రిములు . 
             2 - అభ్యంతరములు . 
     త్వక్కులు మొదలగువాని యందు , స్వేదము మున్నగు బాహ్యమలముల యందు శ్లేష్మము , రక్తము , పురీషములను అభ్యంతర మలముల యందు నాలుగు రకములుగా క్రిములు జనించుచున్నవి. 
          
. ముందుగా మీకు బాహ్యక్రిమి లక్షణం వివరిస్తాను. ఈ బాహ్యక్రిములు 20 రకములు కలవు. ఇవి నువ్వులంత పరిమాణమున ఆకారము కలిగి ఆరంగుతో వస్త్రములను ఆశ్రయించి ఉండును. వీటిని నల్లులు అని పిలుస్తారు . జుట్టులో ఉండు యూక , ఈళ్ళు అని రెండు రకములు ఉండును . వాటిలో మరలా అనేక భేదములు ఉండును. ఎర్రటి మచ్చలు , బొబ్బలు , దురదలను , కంతులను కలిగించును. వీటికి బాహ్యక్రిములు అని పిలుస్తారు .  
            
. ముందుగా అసలు ఈ క్రిమిసంబంధ వ్యాధులు రావడానికి గల కారణం తెలుసుకుందాము . ఎవరైతే మొదట భుజించిన ఆహారం జీర్ణము కాకుండా మరలా భుజిస్తారో , ఎల్లప్పుడు మధురపదార్ధములను ఎక్కువుగా తీసుకుంటారో , ద్రవపదార్ధముల సేవన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉందురో , బెల్లము కలిసిన తిండి అధికముగా తినుదురో , కసరత్తు చేయనివాడు , పగలు నిద్రించువారు , పరస్పర విరుద్ద ఆహారములను భుజించువారు ఈ క్రిమివ్యాధులకు లోనగుదురు.  
        మినపపిండి , ఆమ్ల లవణ రసములు గల ద్రవ్యములు , బెల్లము , కూరగాయలు అధికముగా తినువానికి పురీషము నందు క్రిములు పుట్టును . 
            మాంసము , మత్స్యము , బెల్లము , పాలు , పెరుగు , పులిసిన ( తరువాణి ) వస్తువులు నిత్యము సేవించువానికి కఫము నందు క్రిములు పుట్టును . 
      అజీర్ణకరమైన శాకములు , విరుద్ద ఆహారములు తీసుకొనుటచేత రక్తము నందు క్రిమిదోషాలు కలుగును . 
          క్రిముల మన శరీరం నందు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలుగును. మనం ఆ లక్షణాలని గుర్తించి దోషములకు చికిత్స చేయవలెను . ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 
      జ్వరము , శరీరం రంగు మారు ట , శూల , హృదయము నందు జబ్బు , శరీరాకృశత్వము , భ్రమ , అన్నద్వేషము , అతిసారం అనునవి ఉండువానికి శరీరము నందు క్రిమి ఉన్నదని తెలుసుకొనవలెను . 
  
          ఇప్పుడు కఫజ క్రిమి గురించి వివరిస్తాను. కఫము చేత ఆమాశయము నందు క్రిములు పుట్టును . అవి వృద్ది నొంది శరీరము నందు పైభాగము నందును క్రింద భాగము నందును కూడా తిరుగుచుండును . వీటిలో కొన్ని లావుగా , పొడవుగా ఫిడేలు చర్మపు తీగవలే ఉండును. ఇవి ఆమాశయము నందు , చుట్టుపక్కల ఆశయముల యందు పొరను అంటిపెట్టుకుని ఉండును. కొన్ని ఎర్రల వలే ఉండును. మరికొన్ని సమముగా పొడవుగా ఉండును. కొన్ని సూక్ష్మాకారముగా ఉండును. మరికొన్ని శ్వేత రక్తవర్ణముగా ఉండును. 
     
  కఫజక్రిములు 7 రకాలుగా ఉండును. అవి 
  * ఆంత్రాదములు - 
         ఇవి శరీరం నందలి ప్రేగులను తినుచుండును. 
  * ఉదరావేష్టములు - 
         ఇవి కడుపున చుట్టుకుని ఉండును. 
 * హృదయాదములు - 
         ఇవి హృదయము నందు తిరుగుచుండును. 
 * మహాగుదములు - 
        ఇవి వెడల్పైన గుదములు కల్గి ఉండును. 
 * భుఱువులు . 
 * దర్భ కుసుమములు - 
          ఇవి రెల్లు పువ్వుల వలే ఉండును. 
 * సుగంధములు -  
         ఇవి సుగంధము కలిగి ఉండును. 
        కఫజ క్రిముల వలన హృదయము నందు అదురుట , నోట నీరుకారుట , ఆహారం జీర్ణం కాకుండా ఉండుట , అరుచి , మూర్చ , వాంతి , జ్వరము , కడుపుబ్బరం , కృశించుట , తుమ్ములు , పీనస వంటి సమస్యలు కలుగును. 

  రక్తజ క్రిమి లక్షణము - 
       రక్తమున జనించిన క్రిములు మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలిగి ఉండును. పాదము పొడవు , గుండ్రమైన ఆకారం కలిగి ఉండును. ఎరుపు రంగు కలిగి రక్తం ప్రవహించు సిరలు యందు ఉండును. వాటిలో చాలా వరకు సూక్ష్మ ఆకారం కలిగి ఉండటం వలన కంటికి కనిపించవు. 
       ఈ రక్తజ క్రిమి మొత్తం 6 రకాలుగా ఉండును. అవి 
 * కేశాదములు - 
          ఇవి తల వెంట్రుకలను నశింపచేయును . 
 * రోమ విధ్వంసకములు - 
         ఇవి శరీరం పైన రోమములను రాలిపోవునట్లు చేయును . 

 * రోమద్వికములు - 
        ఇవి రోమకూపములను ఆశ్రయించి ఉండును . 
 * ఉదుంబరములు 
 * సౌరసములు . 
 * మాతలు .  
    
    ఈ రక్తజ క్రిమి వలన ముఖ్యముగా కుష్టువ్యాధిని కలిగించును. ఈ మాతలను జంతుమాతలు అని అంటారు. 
     
. పురీషజ క్రిమి లక్షణాలు గురించి తెలుసుకుందాము . ఇవి పక్వాశయమున పుట్టి అధోమార్గమున సంచరించును. ఇవి వృద్ధినొంది ఆమాశయమునకు పోయి సంచరించునప్పుడు త్రేన్పులు వచ్చును. ఉపిరి బయటకి విడుచునప్పుడు మలము వలే దుర్గంధము బయటకి వెడలును . వీటిలో కొన్ని లావుగా , కొన్ని గుండ్రముగా , కొన్ని స్థూలంగా , కొన్ని శ్యామల పీత వర్ణముగా , కొన్ని తెలుపు , నలుపు రంగులు కలవిగా ఉండును. ఇవి 5 రకాలుగా ఉండును. అవి 
  
. * కకేరుకములు . 
   * మకేరుకములు . 
   * సౌసుదాములు . 
   * లేలిహములు . 
   * సశూలములు . 
     
 ఈ పురీషజ క్రిముల వలన పురీషము ఉండలు ఉండలుగా వెడలుట , శూల , మలబద్ధము , శరీరం కృశించుట , గరగరలాడుట , ఒళ్ళు తెల్లబారి ఉండటం వంటి గుణములు కలిగి ఉండును. ఇవి తమ స్థానములను వదిలి ఇతర స్థానముల యందు సంచరించునప్పుడు గగుర్పాటు , అగ్నిమాంద్యము , గుద స్థానము యందు దురద అను ఉపద్రవములు కలుగును. పాండు రోగము కూడా కలుగును. 
                
. సమాప్తము.

No comments:

Post a Comment