పరిమళ ద్రవ్యముల చరిత్ర అత్యంత పురాతనమైనది. రమారమి మూడువేల సంవత్సరాల క్రితమే వేదములలో వర్ణింపబడిన " పరోమ" విధానమున పరిమళ పుష్పముల యొక్క మరియు సుగంధద్రవ్యముల యొక్క ప్రస్తావన కలదు. ఋషులు పరిమళభరితమైన ధూపము దేవతలను ఆవాహనకు ఉత్తమ సాధనగా భావించిరి. ఆనాడు హోమధూపమును వాతావరణము నందలి కల్మషము ప్రక్షాళణ చేయుటకు , దుర్గన్ధమును , రోగాసాంక్రమిక క్రిములను పారద్రోలుటకు సాధనాభూతముగా ఉపయోగించేవారు.
వరాహమిహిరుడు తన బృహత్సంహిత నందు పరిమళ ద్రవ్యముల గురించి వివరించెను. ఆనాడు శ్రీగంధం ఎక్కువుగా వాడుక నందు ఉండేది. జాజి , దవనం , మరువం , కస్తూరి , కర్పూరం , కుంకుమపువ్వు మున్నగు వస్తువులు కూడా ఉపయోగించేవారు .
. ప్రముఖ మరాఠ కవి గంగాధరుడు "గంధసార - గంధపాత" అను గ్రంథముల యందు పరిమళ ద్రవ్యముల గురించి తెలుపుచూ వాని తయారీ మరియు వినియోగించే విధానం గురించి వివరించాడు. దాదాపు 1500 సంవత్సరముల నాటి పంచతంత్రమున విష్ణుశర్మ సుగంధద్రవ్యముల వర్తకము , బంగారు వర్తకము కంటే లాభసాటిది అని చెప్పుటను గమనిస్తే ఆకాలము నందు వాటిపై ప్రజలకు గల ఇష్టాన్ని మనం గమనించవచ్చు .
ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ దేశము నందలి కుమ్రాన్ గుహలలో తవ్వకాలు జరిపినపుడు పురాతన శాస్త్రవేత్తలకు ఒక పాతనూనె సీసా కనిపించింది. ఆ సీసాను పరిశోధించినప్పుడు అది 2000 సంవత్సరాల పూర్వమునకు చెందినది అని తేలింది . అప్పటి మహారాజులు పరిమళద్రవ్యముగా ఆ సీసా నందలి తైలమును వాడేవారు అని బయటపడినది. ఇన్ని సంవత్సరాలు గడిచినను ఆ సీసా నందలి పరిమళద్రవ్యము ఘుమఘుమలాడుచుండెను.
ప్రాచీన కాలము నందు భారతదేశము , పర్షియా , ఈజిప్టు సుగంధద్రవ్యముల తయారీలో అగ్రగాములుగా ఉండెను . వారు ఆకులు , పువ్వులు , వ్రేళ్లు దంచి చమురులో నానబెట్టి పరిమళద్రవ్యములు తయారుచేసెడివారు. పరిమళ వస్తువులు రోగనివారణలో ప్రముఖ పాత్ర వహించునని ఆయుర్వేద తంత్రకర్త చరకుడు తన చికిత్సాసారమున తెలిపి గంధము , గోరింట , వట్టి వేళ్లు , తామర , కలువలు మున్నగు వానితో సిద్ధము చేసిన తైలములతో చికిత్స చేయు విధానమును వివరించెను.
"సుఖాంతి' అను పుష్ప పరిమళము నిర్ణీత సమయమున నిత్యం వాసన చూసుట వలన ఉబ్బసం వంటి శ్వాశకోశ వ్యాధులు నయం అగును. చంద్రమోహ పుష్పముల సుగంధము మానసిక వ్యాధులకు విరుగుడుగా పనిచేయును . పవనాలి అనే పుష్పముల సుగందము రక్తపోటుకు విరుగుడుగా పనిచేయును . ఈ పువ్వులన్నియు హిమాలయముల యందే లభించును. కొన్ని రకాల పుష్ప సుగంధములను లోపలికి పీల్చుట చేత తలనొప్పి నుండి గుండెపోటు వరకు అనేక రోగములను నయం చేయవచ్చు .
. ఇప్పుడు మరికొన్ని మూలికా సువాసనల ఉపయోగాలు తెలుసుకుందాము.
* పుదీన -
. కొన్ని ఆకులను నలిపి వాసన చూసిన యెడల అరుచి , అగ్నిమాంద్యము , నోటి దుర్గంధం , శిరోభారం , దగ్గు , జలుబు నశించును. దీనిని కూరలలో , పచ్చళ్లలో వాడినయెడల రుచిని పెంచును.
* కొత్తిమీర -
. దీని వాసన చూచినయెడల వాంతులు అరికట్టును. మనసుకు శాంతముగా ఉండును. తలనొప్పి నివారణ అగును.
* దాల్చినచెక్క -
. శ్రీలంక యందు దీని చెట్లు ఉండును. దీని ఆకులను లేదా చెక్క నుంచి తీసిన తైలము నందు నయుజినాల్ , సిన్నామిక్ , అల్దేహైడ్ , పప్పెన్ , ఆల్కాల్సు , బెంజిల్ బెంజోయెట్ సాపరోర్ , ఫర్ ఫ్యులాల్ ఓనోవ్ మున్నగు రసాయనాలు ఉండును. ఇది వాసన చూసినను లేదా తలకు రాచుకొనుచుండిన యెడల దీర్ఘకాలంగా వేధిస్తున్న తలనొప్పి , జలుబు , పొడిదగ్గు నివారించబడును. కడుపులొకి వాడుచున్న కడుపునొప్పి , కడుపుబ్బరం , అతిసారం , రక్తపిత్తము , తెల్లకుసుమ తగ్గును. పాము కరిచినప్పుడు రక్తం పిండి దీని అరుకు అంటించిన యెడల విషము హరించును .
మత్తెక్కించే సువాసనలు -
* గోరింట పువ్వుల గుత్తులను వాసన చూచుచుండిన లేదా తలకింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .
* వెలగ చెట్టు ఆకు వాసన చూచిన యెడల వాంతులు నిలుచును . తలగడ కింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .
* గసగసాలు ఒక స్పూన్ తీసుకుని నాలుగు చుక్కలు ఆవునెయ్యి వేసి ఒక ఇనప గంటెలో వేయించి పలచటి బట్టలో వేసి వాసన చూస్తున్న యెడల గాడనిద్ర పట్టును .
* దవనం , మరువం , జాజి , జాపత్రి , యాలుకలు , చందనం , కురువేరు వంటి ఔషధ తైలాలు గాడనిద్రను కలుగచేయును .
. పైన చెప్పిన గాడనిద్రను కలుగచేయు యోగాలను నిద్రపట్టక ఇబ్బంది పడువారు తప్పక ఉపయోగించుకొని సమస్యల నుంచి బయటపడవచ్చు.
. సంపూర్ణం
No comments:
Post a Comment