మొట్ట మొదట శూన్యంలోంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఓంకారం. ఓంకారం లోంచి ప్రకంపణలవలన శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విశ్వాన్ని, గ్రహ,నక్షత్రాల్ని సృష్టించింది.
శబ్దమే శక్తి యొక్క తొలి వ్యక్త రూపం. ఓంకారం లో అ ,ఉ, మ అనే అక్షరాలున్నాయి. అంటే మనం ఏ శబ్దం పలకాలన్నా నోరు తెరిచి (అ)....నోరు మూసి (మ).
అంటే....లోకంలో ప్రతి శబ్దం అ-మ ల మద్యే జనిస్తుంది.
ఇలా అన్ని శబ్దాలూ ఓమ్ లోంచే పుడుతాయి కనుక ఓం మూల బీజం.
అ, ఉ, మ శబ్దాలను కల్గిఉన్న అక్షరాలను బీజాక్షరాలని అంటారు.
ఉదాహరణకు ...శ్రీ అనేది మ తో కలిసి శ్రీమ్ గా ఏర్పడినప్పుడు అది బీజాక్షరం అవుతుంది.
గ అనేది మ తో కలిసి గం అనే బీజాక్షరం అవుతుంది.
ఇలా మనకు బీజాక్షరాలు ఉద్భవిస్తాయి.
ఓం అంటే శబ్దం. అదే మూల శక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్దమూ శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఆ,ఉ, మ లతో కలసిన ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుంది.
ఎందుకంటే....శక్తి అంటే శబ్దమే. శబ్దం ఎలా పుడుతుంది? ఓం లోంచి. అంటే ఓం లోంచి పుట్టిన బీజాక్షరానికీ శక్తి ఉంటుంది కదా.
అక్షరం అంటే క్షరము(నాశనం)కానిది అని అర్థం. అక్షరం అంటే మనం అనుకునే లెటర్స్ (అ-క్ష) కాదు. లెటర్స్ అక్షరాలైతే.....ఎన్నో లెటర్స్ ఇప్పుడు కనిపించకుండా, వాడుకలో లేకుండా పోయాయి.
అక్షరం అంటే శబ్దము అని అర్థం.శబ్దం ఎన్నటికీ నశించదు. ఆ శబ్దాలకు ఒక్కో స్థలంలో ఒక్కో విధంగా మానవులు గుర్తులు ఉంచుకున్నారు సింబల్స్ నే మనం ఆల్ఫాబెట్స్ (ఆ,a, b) అంటాము.
ఈవిధంగా ఓం లోంచి పుట్టిన అనేక శబ్దాలు బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను మనం ఉచ్చరించి నప్పుడు మన శరీరంలో శక్తి జనిస్తుంది. ఇలా జనించిన శక్తితో మన సంకల్పాలు నెరవేరుతాయి.
బీజం అంటే విత్తనం. బీజాక్షరం అంటే అక్షరమే శక్తి విత్తనంగా ఉంటుంది. ఆ శక్తి విత్తనాన్ని మనం మనలో నాటి నట్లైతే.....రోజూ...ఆ బీజాక్షరాని జపిస్తూ...ఆ నాటిన విత్తనాని కి శక్తినందిస్తూ ...పోషిస్తే, ఆ విత్తనం మొలకెత్తి, వృక్షమై, ఫలాన్నిస్తుంది. అందుకే ఒక్కో బీజాక్షరానికీ కొన్ని జప సంఖ్యలుంటాయి.
అన్నిసార్లు జపిస్తే తప్పా...ఆ చెట్టు ఫలాన్ని ఇవ్వలేదు.
ఇలా ఒక్కో బీజాక్షరం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తాయి.
బీజాక్షరాలని పలికిన ప్రతిసారీ మనలో శక్తి జనిస్తుంది. ఈ శక్తిని మనం గమనించగల్గాలి.
ఇలా బీజాక్షరాలని సమ్మిళితం చేసిన దేవతా నామాలను మంత్రాలని అంటాం. లోకంలో ఏ దేవుని నామంలో ఐనా బీజాక్షరాలు ఉంటాయి.
అన్ని మతాల దేవుళ్ళ పేర్లలోనూ ఈ బీజాక్షరాలు ఉన్నాయి.అందుకే దేవుడి నామం పలకడంతోటే శక్తి పుట్టి....ఆ శక్తి మనలోని పాప రాశి ఐన నెగెటివ్ శక్తిని నిర్మూలించి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఇప్పుడు మంత్రోపదేశం అంటే ఏమిటి?
మనం అన్నం తింటే శక్తి వస్తుంది. అలాగే మంత్రం జపిస్తే శక్తి వస్తుంది.కానీ....అన్నం తినడానికైనా శక్తి కావాలి కదా....ఈ శక్తి ఉంటేనే అన్నం తిని మరింత శక్తిని సంపాదించుకుంటాం.
భగవంతుని నామాన్ని పలికితే చాలు....అందులో బీజాక్షరాలు ఉంటాయి.అందుకే విష్ణు, శివ, లలితా సహస్ర, శత నామాలు ఉన్నాయి.
మనకు భగవంతుని నామాన్ని పలకడానికి ఏ ఉపదేశం అవరసం లేదు. నామం పలికితే ...అందులోని బీజాక్షరాలను పలికే ఆ ఆకాశం ఉండి... ఆ ఫలితం కూడా దక్కుతుంది.
ఉదాహరణకు... విష్ణు సహస్ర నామాల్లో మొదటి నామం
విశ్వాయనమః....... ఇందులో...విశ్వా అనే దానిలో ' అ' ఉంది. ....నమః లో ....అ, మ లు ఉన్నాయి.
లలితా సహస్రంలో.....మొదటి నామం శ్రీమాతా. ఇందులో
శ్రీం...అనే బీజం....
మా ....అనే బీజం
తా.....లో ఆ అనే బీజాక్షరాలు ఉన్నాయి.
దేవతా నామాలు పలికితే చాలు బీజాక్షరాలు పలికిన ఫలితం వస్తుంది.
గురువు లేనివారు....ఎదో ఒక భగవంతుడి నామాన్ని తీసుకుని జపిస్తూ ఉంటే చాలు.
వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి(Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి క్రమముగా వృక్షము మాదిరి వృద్ధిచెందును.
బీజమంత్రములు అనేవి స్పందనలు. ఆత్మయొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే.
తొమ్మిది శబ్దములవరకు ఉన్నది బీజమంత్రము, తొమ్మిదికి మించినయడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు.
అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు. సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’, ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొదటి శబ్దము ‘ఓం’ మాత్రమె.
No comments:
Post a Comment